- ఒంగోలు సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్.,గారు
- ప్రమాద కారణాలపై ఆరా…
- రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ
- వాహనదారులు వేగ పరిమితుల పట్ల జాగ్రత్త వహించి వాహనాలు నడపాలి.
- రహదారి భద్రత సూత్రాలను పాటిస్తూ సురక్షితంగా, క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలి..
NH 16 నేషనల్ హైవే కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒంగోలు నుండి నెల్లూరు వైపు వెళ్ళు మార్గంలో ఆదివారం ఉదయం సుమారు 4.50 నిమిషాలు మూడు వేరువేరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించటం అత్యంత బాధాకరం . ఈ దుర్ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ గారు స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను మరియు పరిస్థితిని నిశితంగా సమీక్షించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా ఎస్పీ గారి వెంట ఉప రవాణా కమిషనర్ శ్రీమతి ఆర్ సుశీల గారు ఉన్నారు.కొప్పోలు నేషనల్ హైవే మీద ఆగి ఉన్న లారీని వెనుక వస్తున్న కోడిగుడ్ల లారీ ఢీకొనటంతో లారీ తిరగబడిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అదే మార్గంలో సుమారు 500 మీటర్ సమీపంలో ఆగి వున్న కారు మరియు ట్రాక్టర్ ను అదే మార్గం వైపు నుండి వెళ్తున్న లారీ రెండిటిని ఢీకొనగా ఎటువంటి ప్రమాదం జరుగులేదు. సుమారు 500 మీటర్ల సమీపంలో అదే మార్గంలో ఆగి ఉన్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న కారును వెనుక ఉన్న లారీ బలంగా ఢీకొనటంతో ఇద్దరూ మరణించగా ఒకరికి తీవ్రమైన రక్త గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ మరియు సంఘమిత్ర హాస్పిటల్ కి పంపటం జరిగింది.
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకున్నామని, వాహనదారులు ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోపాలను అన్ని శాఖల సమన్వయంతో సరిదిద్దుతామని, రోడ్డు భద్రతా ప్రమాణాలపై వాహనదారులకు, ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని ,ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని, డ్రైవర్లు వేగ పరిమితుల పట్ల జాగ్రత్త వహించి పరిమితమైన వేగంతో వెళ్ళాలని, రహదారి భద్రత సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రయాణ జాగ్రత్తలు పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో సహనంతో ఉండి సురక్షితంగా, క్షేమంగా గమ్యాన్ని చేరాలని కోరారు.జిల్లా ఎస్పీ గారు వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, గిద్దలూరు సిఐ సురేష్, నేషనల్ హైవే అధికారులు, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.