- నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ
- 22 నిమిషాల్లోనే ఉగ్రవాదుల పనిపట్టామని వెల్లడి
- పాకిస్థాన్ను మోకాళ్లపై నిలబెట్టామన్న ప్రధాని
- సిందూరం తూటాగా మారితే ఏమవుతుందో చూపించామని వెల్లడి
రాజస్థాన్లోని బికనీర్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రాజస్థాన్లోని బికనీర్లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని తెలిపారు.
“ఏప్రిల్ 22 నాటి దాడికి ప్రతిస్పందనగా మే 7న చేపట్టిన ఆపరేషన్లో ఉగ్రవాదులకు చెందిన 9 అతిపెద్ద స్థావరాలను 22 నిమిషాల్లో ధ్వంసం చేశాం. సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం” అని ప్రధాని మోదీ చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రతీకార చర్యలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆయన పేర్కొన్నారు.