శ్రీశైలం నాగార్జున సాగర్ పెద్ద పులుల అభయారణ్యం ఇప్పుడు ఓ మౌన మృత్యుఘోషతో వణికిపోతోంది. ఆత్మకూరు అటవి డివిజన్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా అడవి పందుల మరణాలు కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా అడవిలోని వివిధ ప్రాంతాల్లో అడవి పందుల కలేభరాలు, మృతదేహాలు లభ్యమవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ మరణాలకు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అంతుచిక్కని వ్యాధి కారణంగానే పందులు మృత్యువాత పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవి అంతటా వ్యాధి వేగంగా వ్యాపిస్తోందా? ఇతర వన్యప్రాణులకూ ప్రమాదం పొంచి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి.
ఈ ఘటనలపై అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన పందుల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. వెటర్నరీ నిపుణులతో కలిసి పరిశీలనలు కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఖచ్చితమైన నివేదిక మాత్రం వెలువడలేదు. అధికారులు ఒక వైపు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు అడవిలో వ్యాధి మరింత వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.అడవిపందులు ఇలా మృతి చెందుతుండటంతో అటవీ సమీప గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తుచేశారు.
“అడవిలో మొదలైన వ్యాధి గ్రామాలకు వస్తే పరిస్థితి ఏంటి?”
అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి నిపుణులు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి మిస్టీరియస్ మరణాలు పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఒక జంతు జాతిలో వ్యాధి మొదలైతే.. అది ఆహార గొలుసు ద్వారా ఇతర జంతువులకు, అంతిమంగా మనుషులకూ చేరే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కారణం తెలియని ఈ వరుస మరణాలు, అటవీ శాఖను పరీక్షకు గురిచేస్తున్నాయి. ఈ వ్యాధి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇతర జంతువులకు వ్యాపిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే వరకు, ఈ అడవి నిశ్శబ్దంలోనూ ఓ అశాంతితో కొనసాగుతూనే ఉంటుంది.
Read More https://politicalhunter.com/african-swinefever-wildboars-die/











