ఈనెల 26వ తేదీన 12:30 గంటలకు శ్రీశైలం క్షేత్రానికి రానున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటనలో భాగంగా అధికారులు ట్రైల్ రన్ నిర్వహించారు
ఒకేసారి మూడు హెలికాప్టర్లు ఆగేందుకు సిద్ధం చేసిన హెలిపాడ్లు
ప్రత్యేక బలగాలతో చుట్టుపక్క ప్రదేశాలన్నీ జల్లెడ పడుతున్న వైనం
భారత రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లను 90 శాతం మేర పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు
భారత రాష్ట్రపతి సోమవారం శ్రీశైలంలో పర్యటించనున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి IPS గారు పరిశీలించారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 26వ తేదీ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని అనంతరం టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీంలో భాగంగా 43.08 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ హెలిపాడ్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమానికి సుమారుగా 1500 మంది సిబ్బందిచే బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.