నక్సల్ బరిలో షాద్ నగర్ యువతి
పోలీస్ ఎన్ కౌంటర్ కన్నుమూసిన విజయలక్ష్మి అలియాస్ భూమిక
12 ఏళ్లుగా అజ్ఞాతంలోనే..
ఉద్యమాలకు ఆకర్షితురాలై వెళ్లి మృత్యువు ఒడిలోకి..
సొంతూరు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వ
తెలంగాణా :- ఉన్నత చదువులకు హైదరాబాద్ వెళ్లిన యువతి అక్కడి నుంచే అన్నల ఉద్యమబాట పట్టింది. పన్నెండు ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండి ఛత్తీస్గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కన్నుమూసింది. ఆమె రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక. గ్రామంలోని వన్నాడ సాయిలు గౌడ్ మొదటి భార్య రాధమ్మకు ముగ్గురు అడపిల్లలు. విజయలక్ష్మి మూడో సంతానం. విజయలక్ష్మి పుట్టిన ఏడాదికి పాము కాటుకు గురై రాధమ్మ మృతి చెందింది. విజయలక్ష్మి కేశంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. అనంతరం అక్కడే ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. డిగ్రీ మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళ కళాశాలలో చదివింది. అనంతరం నిజాం కళాశాలలో ఎల్ఎల్ బి చేస్తున్న సమయంలో ఉద్యమాల పట్ల ఆకర్షితురాలై ఉద్యమబాట పట్టిం ది. అప్పటి నుంచి కుటుంబ బంధాలను తెంచుకుంది. ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత విజయలక్ష్మితో ఎప్పుడూ మాట్లాడలేదని, గ్రామంలోకి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువుకుంటున్న సమయంలో గ్రామంలో చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు.
షాక్ లో గ్రామస్తులు..
విజయలక్ష్మి పన్నెండేళ్ల క్రితం గ్రామాన్ని వదిలి తిరిగి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఎక్కడో చత్తిస్గడ్ రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్ కగార్ లో మృత్యుపాలైయిందని తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియక విజయలక్ష్మి గురించి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఏనాడో మర్చిపోయారు. మళ్లీ ఈనాటికి నక్సల్ బరిలో ఉంటూ ఉద్యమాల కోసమే ఊపిరి పోయిందన్న సమాచారం తెలుసుకుని గ్రామస్తులు షాక్ కు గురయ్యారు.
#Shadnagar girl Bhumika in Chhattisgarh encounter