ప్రకృతి సిద్ధంగా లభించే పళ్లు, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లాంటి ఆహారంగా ఉపయోగపడే పదార్థాలు శరీర పోషణకు, దేహ ధర్మాలు సజావుగా సాగేందుకు, ఆరోగ్య రక్షణకు ఎలా ఉపయోగపడతాయో, అలాగే మన శారీరక, మానసిక రుగ్మతలకు ప్రకృతి జన్య ఔషధాలు కూడాఉపయోగపడతాయి. అలాంటి సహజసిద్ధ ఔషద మొక్కల్లో అక్కల కర్ర కూడా ఒకటి. వివిధ వ్యాధులపై ఈ అక్కల కర్ర సమర్థవంతంగా ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. ఆస్టిరేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అనాసైక్లస్ పైరెత్రం. దీనిని ఆంగ్లంలో పెల్లటరీ అని పిలుస్తారు. సంస్కృతంలో ఆకార కరభ అంటారు.
ఔషధపరంగా అక్కలకర్ర మొక్క వేళ్లే ఎక్కువ ప్రాధాన్యత సంతరించు కున్నాయి. ఎండించిన వేళ్లు సాధారణంగా పచారి కొట్లలోనూ, మూలికలు అమ్మే దుకాణాల్లోనూ లభ్యమవుతాయి.
అక్కల కర్ర కారం రుచితో, వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ‘నాలుకపై వేసుకుంటే చిమచిమలాడుతుంది.అక్కల కర్రను నీటితో నూరి తీసిన గంధాన్ని కణతలకు పట్టు వేస్తే పార్శ్వశూల, వాపు ఉన్న శరీర భాగాలపై పట్టు వేస్తే ఆయా భాగాల వాపు తగ్గుతుంది. ‘ నాలుకకు పూస్తే నత్తి తగ్గుతుంది.
రెండు మూడు చిటికెల అక్కల కర్ర చూర్ణాన్ని పిప్పి పంటిపై ఉంచితే పిప్పి పన్ను బాధనుండి ఉపశమనం లభిస్తుంది. అంగ్రామునుంచి గ్రాము వరకు అక్కలకర్ర చూర్ణాన్ని రోజూ రెండుసార్లు తగినంత తేనెతో కలిపి వాడుతుంటే మాటలు తడబడకుండా స్పష్టంగా వస్తాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో సంచితమైన శ్లేష్మం బైటకు వస్తుంది. ముఖ పక్షవాతమైన బెల్స్ పాల్సీ, ఏకాంగ పక్షవాతం, కీళ్ల నొప్పులు, సయాటికా అనే గృధసీవాతంలో మంచి ప్రయోజనం కలుగుతుంది.
చిన్న ఆక్కల కర్ర ముక్కను నోటిలో ఉంచుకొని కొద్దికొద్దిగా నమిలి రసం మింగుతుంటే అమ పదార్థమంతా బాగా జీర్ణమై జఠరాగ్ని దీప్తి చెంది జీర్ణశక్తి మెరుగవుతుంది. చెమట పుడుతుంది. పళ్లు, చిగుళ్లు, నోటి వ్యాధులు తగ్గడమే కాక, దంతాలు ధృడపడతాయి. నోటిలో లాలాజలం బాగా ఉత్పత్తి అయి నోరు శుభ్రపడుతుంది. శిరోదోషాలు తగ్గుతాయి. దేహానికి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అక్కల కర్ర, మిరియాలు, శొంఠి చూర్ణాలను సమానంగా కలిపి నీటితో మెత్తగా నూరి తలకు పట్టిస్తుంటే దీర్ఘకాల తలనొప్పులు తగ్గుతాయి.
మూర్ఛ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉదయం ఒకగ్రాము పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటూ, వ్యాధి రాబోయే ముందు నశ్యంగా పీలుస్తుంటే చక్కటి ఫలితం కనిపిస్తుందని యునాని వైద్యం పేర్కొంటుంది.
అక్కల కర్ర, శొంఠి, సన్నరాష్ట్రం, నల్ల జీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి ఒకటి రెండు గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం తేనెతో కలిపి వాడితే పక్షవాతం తగ్గుతుంది.
పక్షవాతానికి మంచి ప్రయోజనం
అక్కల కర్ర, శొంఠి, సన్నరాష్ట్రం చూర్ణాలను సమానంగా తీసుకుని పావులీటరు నీటిలో రెండు స్పూన్ల చూర్ణం కలిపి సన్నని మంటపై 100 మీల్లీమీటర్లు మిగిలేవరకూ మరగించి, దించి, వడగట్టి, అవసరమైతే తేనె లేదా పటికబెల్లం పొడి కలిపి రోజుకు రెండు మూడుసార్లు సేవిస్తే పక్షవాతంలో మంచి ప్రయోజనం “” చేకూరటమే కాకుండా, వివిధ రకాల జ్వరాలు తగ్గుతాయి. వెన్ను నొప్పి, పాదాల నొప్పి, మోకాలు, నడుము నొప్పులు మొదలైన వాటిలో ప్రయోజనం చేకూరుతుంది. అక్కల కర్ర చూర్ణాన్ని శీత, వర్షాకాలాల్లో అవ నూనెతో, వేసవి కాలంలో నువ్వు నూనెతో కలిపి మర్ధన చేస్తుంటే ఆయా భాగాలకు రక్త ప్రసరణ జరిగి చైతన్య వంతమై పక్షవాత సమస్య తగ్గుతుంది. కస్తూర్యాది గుటిక, అమృత భల్లాతక, ఆకార కరభాది చూర్ణంలాంటి ఆయుర్వేద ఔషధాల తయారీలో అక్కల కర్రను ఉపయోగిస్తారు. అక్కల కర్ర నుంచి తయారయ్యే పైరెత్రాయిడ్ అనే రసాయనిక పదార్థాన్ని దోమలను పారదోలే మందుల్లో కలుపుతారు.
అక్కల కర్ర చూర్ణంలో మూడవ వంతు చేదు పుచ్చకాయల చూర్ణాల్ని కలిపి ఉదయం, సాయంత్రం పావు స్పూను నుంచి ఒక స్పూను వరకూ సేవిస్తుంటే సుఖ విరేచనమవుతుంది. శరీరంలో అధికంగా సంచితమైన కొవ్వు, నీరు, దుష్ట పదార్థాలు బైటికి వెళ్లిపోయి అధిక బరువు, స్థూలకాయం తగ్గడంలో సహాయపడుతుంది. పావు స్పూను అక్కల కర్ర పొడిని గ్లాసు నీటిలో వేసి మరగించి దించి గోరువెచ్చగా అయిన పిదప వడగట్టి ఆ కషాయాన్ని పుక్కిట పడుతుంటే గొంతు వాపు, నొప్పి, టాన్సిల్స్ వల్ల కలిగే ఇబ్బందులు, నోటి వ్యాధులు, నోటి అరుచి తగ్గి బాగా ఆకలి అవుతుంది. పిత్త ప్రకృతి ఉన్నవారు అంటే వేడి తత్వమున్న వారు, కడుపులో, ప్రేవుల్లో అల్సర్లు ఉన్నవారు, నోరు, నాసికా మార్గాల నుంచి రక్తం పడే వారు అక్కల కర్ర వాడకంలో వైద్య సలహాను అనుసరించాలి.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV