కమ్యూనిస్ట్ కొండారెడ్డి

Communist Konda Reddy

Communist Konda Reddy

కాశీపురం ప్రభాకర్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్ – రచయిత )

మా తండ్రి దివంగత నేత, విప్లవ కవి..కామ్రేడ్ జి వి కొండారెడ్డి గారి 36 వ వర్ధంతి సందర్బంగా…

కోవెలకుంట్ల లోని GVK మెమోరియల్ గ్రంధాలయంలో….

శ్రీ పాణ్యం నాగార్జున గారి సంపాదకత్వంలో వచ్చిన “నా కోవెలకుంట్ల ధరిత్రి పుస్తకంలో ఆయన గురించి ప్రచురితమైన వ్యాసం..

*నా కోవెలకుంట్ల ధరిత్రి-59*

*కోవెలకుంట్ల ప్రముఖులు*

*వామపక్ష ఉద్యమ కెరటం… గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి*

*(కమ్యూనిస్ట్ కొండారెడ్డి)*

*1956 నుంచి 1985* వరకు మూడు దశాబ్దాల వామపక్ష, అతివాద ఉద్యమాలకు నిలువెత్తు సాక్షీ భూతం కీ.శే. గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి గారు.

రాష్ట్ర ప్రజలకు గంగిరెడ్డిగా పరిచయం ఉన్న కొండారెడ్డి స్వతహాగా మంచి కవి రచయిత. ప్రజా ఉద్యమాలే ఊపిరి గా చివరిదాకా పోరాడిన గంగిరెడ్డి గారు..

*1935 మే నెల 5 న* నేటి అవుకు మండలం కాశీపురం అనే మారుమూల కుగ్రామంలో జన్మించారు. వెంగళ రెడ్డి, వీరమ్మ ఆయన తల్లిదండ్రులు.

నెలల పసి బాలుడుగా ఉన్నప్పుడే తండ్రి వెంగళరెడ్డి చనిపోవడంతో అన్న అయ్యపురెడ్డి ప్రేమగా పెంచుకున్నారు.

తన తమ్ముడు చదువుకొని ఆఫీసర్ కావాలి అని అయ్యపురెడ్డి గారు కళలుకన్నారు. అయితే ఊర్లో ప్రాధమిక పాఠశాల కూడా లేదు.

దీంతో తమ గ్రామానికి “పాగి” ఉన్న సుదూర గ్రామం యాల్లూరు లో ఒక తెలిసిన రైతు ఇంట ఉంచి ప్రాధమిక విద్య నేర్పించారు.

(కరువు వచ్చినప్పుడు ఒక ఊరిని ఇంకో ఊరు రైతులు తిండి గింజలు, పశువుల దాణా ఇచ్చి ఆదుకునే సంప్రదాయాన్ని “పాగి ” అనే వాళ్ళు.)

ప్రాధమిక విద్య పూర్తయ్యాక కోవెలకుంట్ల ఉన్నత పాఠశాలలో కొండారెడ్డి చదువుకున్నారు.

తర్వాత కాలంలో రాజకీయ ప్రముఖులైన మాజీ ఎమ్మెల్యేలు బీ వీ. నరసింహారెడ్డి, కర్రా సుబ్బారెడ్డి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు బీ.వీ నాగిరెడ్డి,

బాచం వెంకట రెడ్డి తదితరులు ఈయన సహాధ్యాయులు. హైస్కూల్ విద్య అనంతరం పి.యూ.సీ విద్య కోసం విజయవాడ లయోలా కళాశాలలో చేరారు.

అప్పట్లో విజయవాడలో వామపక్ష ఉద్యమాలు బాగా నడిచేవి. అదే సమయంలోనే కొండారెడ్డి గారు కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు.

విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. కర్రా సుబ్బారెడ్డి ఈయన రూం మేట్. పువ్వాడ నాగేశ్వర రావు గారు ఈయన ఉద్యమ సహచరులు.

పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రతి సభలోనూ పాల్గొని చురుకైన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం లా విద్య కోసం మద్రాస్ వెళ్లారు.

అయితే హిస్టరీ పట్ల మక్కువతో ఏడాది లోపే తిరిగి వచ్చారు. కర్నూల్ ఉస్మానియా కళాశాలలో బీ.ఏ అభ్యసించారు.

*A.I.S.F కర్నూల్ జిల్లా వ్యవస్థాపకులుగా*

ఉస్మానియా కళాశాలలో సి.పి.ఐ అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి, విద్యార్థి హక్కుల కోసం పోరాడారు. జిల్లా లోని అన్ని తాలూకా కేంద్రాల్లోను ..

ఆయా కళాశాలల్లో స్టూడెంట్ ఫెడరేషన్ బ్రాంచ్ లను ఏర్పరిచారు. సిపిఐ జాతీయ స్థాయి నేత అయిన *సురవరం సుధాకర్ రెడ్డి* గారు కూడా కొండారెడ్డి గారి శిష్యుల్లో ఒకరు.

స్టూడెంట్ యూనియన్ కు జరిగే ఎన్నికల్లో అంతవరకూ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన NSU దే ఆధిపత్యంగా ఉండేది.

ఆ సంస్థ తరుపున *రాంభూపాల్ చౌదరి* (తర్వాత రోజుల్లో ఆయన కర్నూల్ ఎమ్మెల్యే గానూ, ఆంధ్రప్రదేశ్ మంత్రి గానూ చేశారు) నిలబడ్డారు.

అయితే, AISF తరుపున కొండారెడ్డి గారు తన జూనియర్ అయిన *సురవరం సుధాకర్ రెడ్డి* గారిని రంగంలో దింపి చౌదరి గారిని భారీ తేడా తో ఓడించారు.

కర్నూల్ ఉస్మానియా కళాశాలలో ఉండగా కొండారెడ్డి గారు విద్యార్థి ఉద్యమాలతో ఎన్నో హక్కులు సాధించారు అనీ, పోరాట తత్త్వం తనకు..

కొండారెడ్డి గారి నుంచే అలవడింది అని సురవరం సుధాకర్ రెడ్డి గారు నేటికీ మననం చేసుకుంటారు.

*ఉద్యమాలే ఊపిరిగా*

———–

*1961* లో కొండారెడ్డి గారు తమ సమీప బంధువు అయిన *సావిత్రమ్మ* గారిని వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ పూజారి లేకుండా జరిగిన ఈ వివాహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి నిర్వహించారు.

1962 లో చైనా యుద్ధం తర్వాత భారత దేశం లోని కమ్యూనిస్ట్ నాయకుల్లో తీవ్ర అంతర్మధనం జరిగింది. దీంతో 1964 లో సిపిఐ పార్టీ చీలినప్పుడు కొండారెడ్డి గారు

సిపిఐ (M) భావజాలం వైపు ఉన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో అధికారం లోకి వచ్చారు.

అయితే, 1967 లో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి జిల్లా *’నక్సల్బరి’* అనే గ్రామంలో రైతాంగ పోరాటాన్ని అధికార కమ్యూనిస్ట్ ప్రభుత్వం..

కర్కషత్వంగా అణచివేసిన తీరుపట్ల దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల్లో వ్యతిరేకత వచ్చింది. సిలిగురి జిల్లాకు చెందిన సీనియర్ కమ్యూనిస్ట్..

యోధులు చారు మజుందార్, కాను సన్యాల్ వంటి నాయకులు సాయుధ పోరాటమే రైతాంగ, పీడిత ప్రజల విముక్తికి మార్గం అని బోధించ సాగారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వర రావు తదితర నేతలు విప్లవొద్యమం వైపు మొగ్గు చూపారు.

దీంతో 1969 లో సిపిఎం నుంచి *సిపిఐ (ML) పార్టీ* ఆవిర్భవించింది. తరిమెల నాగిరెడ్డి , చండ్ర పుల్లారెడ్డిలతో పాటు కొండారెడ్డి గారు కూడా విప్లవ పంథా లోకి వెళ్లిపోయారు.

1969 లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో తెలంగాణ లోని చరిత్రత్మాక *పగిడేరు ఆయుధ దాడిలో* పాల్గొన్నారు.

1970 తొలినాళ్ళలో సిపిఐ (ML) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భూవిముక్తి పోరాటాలు జరిగాయి. బనగానపల్లెలో జరిగిన పోరాటానికి కొండారెడ్డి గారు నాయకత్వం వహించారు.

కొండారెడ్డి గారు జైలు శిక్షకు సిద్దం

ఉద్యమ నేతలందరినీ అరెస్ట్ చేశారు. న్యాయస్థానం కొండారెడ్డి గారికి రు150 జరిమాన లేదా 6 నెలలు జైలుశిక్ష విధించింది.

అయితే, కొండారెడ్డి గారు జైలు శిక్ష అనుభవించేందుకే సిద్దపడ్డారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉండగా ఆయన ఖైదీల కనీస హక్కుల కోసం పోరాటం చేశారు.

కొండారెడ్డి గారి నాయకత్వంలో విశాఖ సెంట్రల్ జైలులో మొదలైన నిరాహార దీక్షలు ఉవ్వెత్తున ఎగసి సికింద్రాబాద్, రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో కూడా ఊపందుకున్నాయి.

దీంతో ప్రభుత్వం దిగివచ్చి ఖైదీ లకు ప్రతి నెలా బంధుమిత్రులతో *మిలాఖత్* అవకాశం, జైలు గదుల్లో కనీస వసతులు, వారానికి ఒకసారి మాంసాహారం వంటి హక్కులు సిద్దించాయి.

*విరసం తొలి ప్రచురణ “నాంది”*

విప్లవొద్యమానికి ఊతమిస్తూ కొండారెడ్డి గారు ” *గంగిరెడ్డి* ” అనే కలం పేరుతో అనేక గేయాలు రాశారు. విమోచన పత్రిక లో..

ఆయన రాసిన *”ఓ అమర కళా వేత్తలారా”* అనే గేయం అప్పట్లో తెలుగునాట ప్రతి విప్లవ సభావేదిక లోనూ ప్రతిధ్వనించేది.

జైలులో ఉండగా గంగిరెడ్డి గారు రాసిన *”నాంది”* అనే నాటకం అప్పట్లో పెద్ద సంచలనం. 1970 జూలై 4 న *శ్రీ శ్రీ* అధ్యక్షులు గా ఏర్పడిన..

విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రచురించిన మొట్ట మొదటి పుస్తకం గంగిరెడ్డిగారి ” *నాంది* ” కావడం గమనార్హం. “మా భూమి” నాటకం తర్వాత ..

అత్యధిక ప్రదర్శనలు జరిగిన నాటకంగా (2 ఏళ్లలో 450 ప్రదర్శనలు ) నాంది వినుతికెక్కింది. ఎమర్జెన్సీ కాలం లో ప్రభుత్వం నిషేధించిన పుస్తకాల్లో..

తరిమెల నాగిరెడ్డి గారు రాసిన “తాకట్టులో భారతదేశం” తో పాటు గంగిరెడ్డి గారి నాంది కూడా ఒకటి.

జైలు నుంచి విడుదల అయ్యాక ఆయన అంటరాని తనం అనే సామాజిక జాడ్యo పై పోరాడారు. కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఈ జాద్యం మరీ ఎక్కువగా ఉండేది.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

వందల ఏళ్ల నుంచి ప్రఖ్యాతి గాంచిన కోసిగి దొరల పెత్తనంపై కొండారెడ్డి, ఉల్లిగడ్డల వీరన్న గార్ల నాయకత్వంలో జరిగిన రైతాంగ విముక్తి పోరాటం కర్నూల్ జిల్లా ఉద్యమాల చరిత్రలో ఘన విజయంగా చెప్పుకుంటారు. ప్రముఖ సోషలిస్టు నేత *గా.మా.గో* గారితో పాటు దళితుల తో సహాపంక్తి భోజనాలను ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించారు. కర్నూల్ దగ్గర హంద్రీ నది గట్టు గ్రామం అయిన మారుమూల బొల్లవరం గ్రామం లో రామచంద్రయ్య గారితో పాటు కుల వివక్షత పై పోరాడి విజయం సాధించారు. రాష్ట్రంలో విముక్తి చెందిన తొలి గ్రామంగా బొల్లవరం గుర్తించబడింది. అందుకు చిహ్నంగా కొండారెడ్డి గారి నాయకత్వంలో నిర్మించబడిన స్తూపం నేటికీ ఆ గ్రామ విజయగాధ ను సగర్వoగా చాటుతుంది.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

కమ్యూనిస్ట్ ఉద్యమాలను అణచివేత MISA చట్టం

కోవెలకుంట్ల పట్టణంలో *తాలూకా యువ సమాఖ్య* ఏర్పాటు చేసి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు కేంద్ర బిందువు చేశారు. దీనికి అధ్యక్షులుగా ప్రముఖ లాయర్ కర్రా సుబ్బారెడ్డి, ఓ. ఎల్లా రెడ్డి, పాణ్యం రాధాకృష్ణ, లాయర్ బాబు, కామిని వేణుగోపాల్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, కరీంభాషా తదితరులు పనిచేశారు. యువసమాఖ్య ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం లభించింది.

దేశ వ్యాప్తంగా రగులుతున్న ప్రభుత్వ వ్యతిరేకతనూ, కమ్యూనిస్ట్ ఉద్యమాలను అణచి వేసేందుకు 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తెచ్చిన MISA చట్టం (Maintenence of Internal Security Act ) వివాదాస్పదం అయింది. 1975 లో ఎమర్జెన్సీ సందర్బంగా ఇదే చట్టం తీవ్రంగా దుర్వినియోగం అయింది. రాష్ట్రంలో జలగం వెంగలరావు ప్రభుత్వం కమ్యూనిస్ట్ ఉద్యమాలను కఠినంగా అణగదొక్కింది. అరెస్ట్ అయిన బొల్లవరం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్ వంటి నేతలను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసి భయాందోళనలను రేకెత్తిoచింది. దీంతో ఉద్యమ నేతలందరూ అజ్ఞాతం (U.G.) లోకి వెళ్లిపోయారు.

*మహాకవి శ్రీ శ్రీ పెళ్లి పెద్దగా*

ఎమర్జెన్సీ రోజుల్లో గంగిరెడ్డి గారి పెద్ద కుమార్తె *భారతి* కి ఆయన మేనల్లుడు అయిన *దీవిరెడ్డి తిరుపాల్ రెడ్డి* తో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే, అజ్ఞాతంగా ఉంటూ ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్న గంగిరెడ్డి గారిపై పోలీస్ నిఘా ఎక్కువైంది. ఈ కారణం గా ఆయన తన కుమార్తె భారతి వివాహానికి హాజరు కాలేక పోయారు. దీంతో *మహా కవి శ్రీ శ్రీ* మద్రాస్ నుంచి వచ్చి స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించారు. గంగిరెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో వచ్చి నిఘా పెట్టిన పోలీస్లకు నిరాశే ఎదురైంది. *మా భారతి వివాహానికి వచ్చిన పెద్దలకు, పిలవకుండానే వచ్చిన అతిధులకు మా కృతజ్ఞతలు* అంటూ శ్రీ శ్రీ తన ప్రసంగంలో పోలీస్ వారి గురించి వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ నిర్భంధాలను అధిగమించి ప్రజా పోరాటాల్లో ఎన్నో కీలక విజయాలు సాధించిన కమ్యూనిస్ట్ యోధుల్లో అనంతర కాలంలో తీవ్ర భావజాల విభేదాలు పొడసూపాయి. చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి లు వేర్వేరు పంధా ల్లోకి వెళ్లారు. ఇదే సందర్భంలో సాయుధ పోరాటానికి ప్రజా మద్దతు కొరవడింది అని భావించిన కమ్యూనిస్ట్ మేధావులు కొందరు ప్రజా స్వామ్య పంధాలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఆ విధంగా ఎన్నికల్లో పాల్గొని విప్లవ పార్టీల నుంచి బయటకు వచ్చిన నాయకుల్లో గంగిరెడ్డి కొండారెడ్డి గారు కూడా ఒకరు.

*కోవెలకుంట్ల నుంచి ఎన్నికల బరిలో*

1978 లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సిపిఐ (ML) అభ్యర్థి గా *ఉదయించే సూర్యుడు గుర్తు* పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన పౌర హక్కుల ఉద్యమంలో పాలు పంచుకుంటూ పూర్తిగా ప్రజా సమస్య లపై పోరాటం చేయసాగారు. పౌర హక్కుల సంఘం కర్నూల్ జిల్లా కార్యదర్శిగా ఆయన ఎన్నో ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండ గట్టారు. కోవెలకుంట్ల ఎమ్మెల్యే కానాల అంకిరెడ్డి గారి మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున మాయలూరు కు చెందిన M.K.V రెడ్డి గారు నామినేషన్ వేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారని అంతా భావించారు. అయితే, గంగిరెడ్డి కొండారెడ్డి గారు తన అనుచరుడైన సుంకేసుల గ్రామానికి చెందిన ఆదిఆంధ్ర చిన్న నారాయణ అనే దళితుడిని రంగంలో దించి ఎన్నికల్లో పోటీని అనివార్యం చేశారు. ఈ ఎన్నికల్లో చిన్న నారాయణ గారికి డిపాజిట్ దక్కడం విశేషం.

*అవుకు రిజర్వాయర్ సాధన కోసం అలుపెరుగని పోరాటం*

1980 ప్రాంతం లో ఎస్సార్బీసి ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చినప్పుడు గంగిరెడ్డి కొండారెడ్డి గారు అవుకు చెరువును బ్యాలన్సింగ్ రిజర్వాయర్ చేయాలని అనేక ఉద్యమాలు చేశారు.

1983, 1985 లో కోవెలకుంట్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులు బీ.వి.నరసింహరెడ్డి, కర్రా సుబ్బారెడ్డి ల విజయానికి కృషి చేశారు.

1985 లో డా.ఎం.వి రమణా రెడ్డి గారు స్థాపించిన రాయలసీమ విమోచన సమితికి కర్నూల్ జిల్లా కన్వినర్ గా ఉన్నారు.

1986 లో డా.వై ఎస్సార్, మైసూరా రెడ్డి, భూమన్ వంటి రాయలసీమ నేతలు నిర్వహించిన చారిత్రాత్మక కరువు బండ యాత్ర లో కీలక పాత్ర పోషించారు.

కర్నూల్ జిల్లా పౌర హక్కుల సంఘం కార్యదర్శి గా పని చేసే రోజుల్లో జిల్లాలో అప్పుడప్పుడే మొదలు అవుతున్న ఫ్యాక్షన్లకు వ్యతిరేకంగా ఎన్నో చైతన్య సభలు నిర్వహించారు. నాగటూరు, పర్ల, బిజినవేముల వంటి గ్రామాల్లో తలెత్తిన వర్గ తగాదాలను పెద్దరికం చేసి రాజీ చేయించారు.

అయితే, కొందరి విషయంలో కాలం ఎంతో క్రూర మైనది. ఫ్యాక్షన్లకు వ్యతిరేకంగా ఎన్నో గ్రామాలను చైతన్యం చేసిన కొండారెడ్డి గారు అదే ఫ్యాక్షన్ రక్కసి బారిన చిక్కుకోవడం దురదృష్టకరం.

1987 లో వచ్చిన మండల ఎన్నికల్లో అవుకు నుంచి చల్లా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున నిలబడ్డారు. కొండారెడ్డి గారికి టీడీపీ తరుపున టికెట్ ఇచ్చారు. అయితే ఫ్యాక్షన్ రాజకీయాలు ఇష్టం లేని కొండారెడ్డి గారు తాను పోటీ చేయకుండా సంగపట్నం పక్కి్ర్ రెడ్డిని రంగంలో దించారు.

అయితే, అదే ఎన్నికల వలన ఎన్నో అపార్థాల మధ్య సొంత ఊరిలో వచ్చిన ఫ్యాక్షన్ ఊబిలో ఇరుక్కు పోయారు. *1988 ఫిబ్రవరి 24 న* ఫ్యాక్షన్ రక్కసి కోరల్లో చిక్కుకుని అసువులు బాశారు.

కొండారెడ్డి గారి జ్ఞాపకార్థం

కొండారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన అభిమానులు కోవెలకుంట్ల గాంధీ సెంటర్లో ఒక గ్రంధాలయం నిర్మించారు. అదే స్థలంలో కొండారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 24 న ఆయన వర్ధంతిసభ ను కోవెలకుంట్లలో ఘనంగా నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top