ఏపి డిజిపికి రాష్ట్ర సమాచార కమీషన్ షోకాజ్ నోటీస్
- స్వయంగా హాజరు కావాలని డిజిపి, గుంటూరు డిఐజి లకు ఆదేశం
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కోవిడ్ రూమ్స్ నిర్మాణంపై ఫిర్యాదులు
- ఫిర్యాదులపై చర్యల తాలూకు సమాచారం కోరిన జర్నలిస్ట్
- సమాచార నిరాకరణపై రాష్ట్ర సమాచార కమీషన్ ఆగ్రహం
మంగళగిరి కరోనా విలయ తాండవం చేస్తున్నకాలంలో(2020-2021) ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సుమారు 63 పోలీస్ స్టేషన్ లలో డిజిగ్నేటేడ్ పేరుతో ప్రజల నుండి బలవంతపు వసూళ్ళకు పాల్పడి అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలపై, సంబంధిత అధికారులపై చర్యలు కోరుతూ 2022 ఏప్రియల్ 10 తేదిన ఆంధ్రప్రదేశ్ డిజిపికి చీరాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డి దాఖలు పరచిన ఫిర్యాదుపై అప్పటి గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమవర్మను విచారణకు ఆదేశించారు. పోలీస్ శాఖ చేపట్టిన విచారణా, చర్యల తాలూకు సమాచారం కోసం విచారణ, చేపట్టిన చర్యల పూర్తి సమాచారం ధృవీకరించి ఇవ్వవలసినదిగా కోరుతూ ఫిర్యాదుదారుడు 2022 నవంబర్ 12న దాఖలు పరచిన దరఖాస్తును డిజిపి, గుంటూరు డిఐజి కార్యాలయములు చట్టబద్దంగా పరిష్కరించలేదని, సమాచారం ఇప్పించవలసినదిగా కోరుతూ రాష్ట్ర సమాచార కమీషన్ నందు దాఖలు పరచిన రెండవ అప్పీల్ పై రాష్ట్ర సమాచార కమీషనర్ సి.హెచ్ సునీల్ చాంబర్ లో మంగళవారం విచారణ జరిగింది. విచారణకు అప్పీల్ దారుడు నాగార్జునరెడ్డి, డిజిపి, గుంటూరు డిఐజి కార్యాలయముల ప్రజా సమాచార అధికారుల ప్రతినిధులు హాజరైనారు. వాదప్రతివాదనలు పరిశీలించిన సమాచార కమీషనర్ అప్పీల్ దారుని వాదనలను పరిగణనలోనికి తీసుకుని తదుపరి విచారణకు స్వయంగా హాజరు కావాలని, సదరు ఫిర్యాదులపై చేపట్టిన చర్యల విషయమై వివరణ ఇవ్వాలని ఏపి డిజిపికి రాష్ట్ర సమాచార కమీషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు అప్పీల్ దారుడు నాగార్జునరెడ్డి మీడియాకు తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కోవిడ్ విపత్కర సమయంలో అప్పటి జిల్లా ఎస్పి సిద్దార్ద్ కౌసిల్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు చేసిన అరాచకాలు, దోపిడీ బహిర్గతం అవుతాయని వాస్తవ సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారనీ నాగార్జునరెడ్డి ఆరోపించారు.











