నల్లమల చెంచులపై వివక్ష

nallamala chenchulu

nallamala chenchulu

  • ఆశచూపి బతుకు కూల్చే యత్నం..
  • డబ్బులిచ్చి పారద్రోలేప్రయత్నం:
  • నిర్వాసితం మరణంతో సమానం.
  • పునరావాసం జీవన్మరణ స్తితి.

ప్రపంచ వ్యాప్తంగా అభివృధ్ది పేరిట జరుగుతున్న విధ్వంసంలో సమిధలవుతున్న గిరిజనులు మాదిరే నల్లమల చెంచులు కూడా అశాస్త్రీయ పునరావాస బాణానికి గాయపడ్డారు.పులుల అభయారణ్యంలొ మానవ సంచారం వుండరాదంటూ, అడవుల్లో అనాగరికంగా బతుకుతున్నారని వారిని నాగరిక(?) సమాజంలో కలిపేందుకంటూ కారణాలను చూపుతూ రెండున్నర్ర దశాభ్దాల పలు చెంచు గూడేలను ప్రభుత్వం బలవంతంగా తరలించింది. ఇలా చెంచులు మొట్టమొదటి సారిగా తమ సహజ ఆవాసాలకు దూరమయ్యారు.ఈ పునరావాస పథకం చెచుల జీవితాలను ధుర్భరం చేసింది. ఈ ప్రయోగం ఎంతటి వైఫల్యం చెందిందొ ఆత్మకూరు అటవీ డివిజన్ లోని పెచ్చెరువు,రుద్రకోడూరు, పసురుట్ల, నారపరెడ్డికుంట, నెమళ్లకుంట లాంటి చెంచు గూడాలు సజీవ నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

నాగార్జున సాగర్ -శ్రీశైలం పులుల అభయారణ్యం ఏర్పాటుకాగానే మొట్టమొదుట అటవీబహిష్కారం పొందిన చెంచు గూడెం పెచ్చెరువు. వీరికి దట్టమైన అటవి ప్రాంతం నుంచి సుమారు 50కి.మీ దూరంలో వున్న మైదాన ప్రాంతంలోని కొట్టాలచెరువులొ పునరావాసం కల్పించారు.పొలాలిచ్చి దున్నుకోమన్నారు. ఆహారసేకరణ దశ దాటని చెంచులను ఇలా మానవ జీవ పరిణామ క్రమంలోని మలి దశ అయిన వ్యవసాయానికి ప్రభుత్వం ఓ గెంతుతో తీసుకు పోదల్చింది.ప్రభుత్వంతో పాటు గెంతలేని చెంచులు బతుకు కోసం జీవన్మరణ పోరాటం చేసారు.ఈ పోరాటంలో రోగాలు,పౌష్టికాహార లోపాలతో వందలాది మంది మరణించారు. చచ్చినవారు చావగా మిగిలినవారు బతుకు జీవుడా అంటు తమ తొలి ఆవాసమైన పెచ్చెర్వుకు చేరుకున్నారు.కాని అప్పటికే వారి గూడెం రెవిన్యూ రికార్డుల్లో మాయమైంది.ఇలా ఒకప్పటి చెంచుల రాజధాని అయిన పెచ్చెర్వు ప్రస్తుతం చట్ట వ్యతిరేకంగా చెంచులు నివశిస్తున్న ప్రాంతంగా మిగిలి పోయింది.

ఇలాగే నాగరిక సమాజపు జీవన్నాన్ని రుచి చూపుతామంటూ ఆత్మకూరు మండలం నల్లకాలువ పరిధిలోని నల్లమలలో వున్న జంట చెంచు గూడాలు రుద్రకోడు,పసురుట్ల లను నల్లకాలువ గ్రామంలో పునరావాసం కల్పించారు.ఐతే అడవిలో దొరికే కాయకసురు ఏరుకుని పట్టణాలలో అమ్ముకుని స్వతంత్ర ఆర్థిక జీవనం గడిపే చెంచులను ఈ పునరావాసం పరాన్నభుక్కులుగా మార్చింది.వరకట్నం,గృహ హింస,వ్యభిచారం,స్వంత ఆస్తి స్వార్థం,వంటి సమకాలీన నాగరిక సమాజపు దిర్వవహారాలు ఏవీ లేని చెంచులు అనతి కాలంలోనే సర్వభ్రష్టత్వం పొందారు. తిరిగి అడవి చేరుకోలేని వీరు నల్లకాల్వలో భిక్సుక వృత్తితో బతుకు తున్నారు.

ఈ పునరావాస వ్యవహారంతో పాఠాలు నేర్చుకోని ప్రభుత్వాలు తిరిగి చెంచులను పనిగట్టుకుని మరోమారు అడవులకు దూరం చేయబోతోంది.ఈ సారి డబ్బుల మూటలతో చెంచులను బెలిపించి వారి అస్తిత్వాన్ని రూపుమాపనెంచింది. పులుల అభయారణ్యంలో వున్న చెంచు కుటుంబాలకు ఒక్కింటికి రూ10 లక్షలు ఇవ్వడం ద్వారా ఈ వ్యవహారం చక్కదిద్ద దల్చింది.ఈ వ్యవహారమంతా చాపకింద నీరులా సాగుతోంది. కానీ మానవ పరిణామ క్రమంలో వేల సంవత్సరాల వెనుకెక్కడో నిలిచిపోయిన జాతిని సంరక్షంచే పద్దతి ఇదేనా?.మావోల డంపు దొరికితే అగ్గి పెట్టెకు ఐదువందలిచ్చి కొన్న వెనుకుబాటు చెంచులది.పదికోట్లిచ్చినా అభివృద్ది చెందుతారా. వారి జీవితాలకు సమీకృత అభివృధ్ధి నెనరు కల్గిన అధికారుల పర్యవేక్షణ అవసరమని చెబుతున్న ప్రజాస్వామిక వాదుల మాటలు వినపడతాయా? ప్రముఖ స్వచ్చంద సేవకులు బీడీ శర్మ ఓ సంధర్భంలో మట్లాడుతూ మొక్కను పెరికి నాటితే బతుకుతుంది కాని చెట్టును కాదు అన్నమాటలు మన పాలకుల చెవులకెక్కేదెలా?

రచనా కాలం,మార్చ్ 11,2010 , నాగారెడ్డి సుబ్బారెడ్డి (సీనియర్ జర్నలిస్ట్ )

ReadMorehttps://www.facebook.com/share/p/1FrDEihsEx/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top