సోషల్ మీడియా’కు అక్రిడిటేషన్స్ పై మల్ల గుల్లాలు..!?
పాత్రికేయులకు మంజూరు చేసే అక్రిడిటేషన్స్పై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.ప్రతి రెండేళ్ల కోసారి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్స్ మంజూరు చేస్తుంటుంది.అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రిడిటేషన్ మంజూరుపై కసరత్తులు చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్స్ ఇవ్వడానికి సంసిద్ధమైంది. అయితే..ఈసారి యూట్యూబర్స్కు,సోషల్ మీడియాలోని పలు ప్లాట్ఫామ్స్ కూడా అక్రిడిటేషన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వంలోని కీలక మంత్రి వద్ద నుంచి వచ్చిందనే ప్రచారం సాగుతోంది.ఆయన ఎన్నికల సమయంలో వీరందరికీ అక్రిడిటేషన్స్ ఇస్తామని హామీ ఇచ్చారని,దాని ప్రకారం వారికి కూడా అక్రిడిటేషన్స్ మంజూరు చేయాలని సమాచారశాఖ మంత్రిని,అధికారులను ఆదేశించారని వార్తలు వచ్చాయి.
దీనిపై జర్నలిస్టులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.ఎటువంటి నియమ, నిబంధనలను అనుసరించని, చట్టపరిధిలోకి రాని సోషల్ మీడియా,యూట్యూబర్స్కు అక్రిడిటేషన్స్ ఎలా ఇస్తారనే ప్రశ్న జర్నలిస్టు వర్గాల నుంచి వచ్చింది. దీంతో నూతన జీవో తయారు అయినా..దాన్ని అమలు చేయలేని పరిస్థితి.అయితే నూతన జీవోను రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ కోసం ఉంచినప్పుడు దానిపై వాదోపవాదాలు సాగాయి. కొందరు మంత్రులు యూట్యూబర్స్,సోషల్ మీడియాకు అక్రిడిటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయగా..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడారని ప్రచారం సాగింది.చివరకు దీనిపై మంత్రుల కమిటీ వేసి,వారి అభిప్రాయాల ప్రకారం చేద్దామంటూ..అప్పట్లో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చను ముగించేశారు.
అయితే..ఇప్పుడా మంత్రుల కమిటీ నేడు సమావేశమైంది.ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్,పార్థసారధి,దుర్గేశ్లు సభ్యులుగా ఉన్నారు.ఈరోజు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం యూట్యూబర్స్, సోషల్మీడియాకు అక్రిడిటేషన్ల విషయంపై చర్చించింది.దీనిపై అధికారుల అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. అయితే..యూట్యూబర్స్కు, సోషల్ మీడియాకు అక్రిడిటేషన్స్ ఇవ్వడంపై అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదనే ప్రచారం సాగుతోంది.
అదే విధంగా మంత్రులు కూడా ఇష్టపడలేదంటున్నారు. అయితే..కీలక మంత్రి మనోభావాలకు విరుద్ధంగా వీరు..తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తారా..? అనేది సందేహమే.వాస్తవానికి యూట్యూబర్స్కు,సోషల్ మీడియాకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అక్రిడిటేషన్స్ మంజూరు చేయడం లేదు.సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపిచెందిన మాట నిజమే అయినా..ఎటువంటి చట్టబద్ధత లేకుండా,నియమ నిబంధలను పట్టించుకోకుండా, చిరునామా లేకుండా ఉండే సోషల్ మీడియా వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావన అన్ని వర్గాల్లో ఉంది.
వీరి వల్ల సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని, ఇప్పుడు స్మార్ట్ మొబైల్ ఉన్నప్రతి ఒక్కరూ జర్నలిస్టులుగా మారుతున్నారని,వీరందరికీ అక్రిడిటేషన్స్ ఇవ్వడం అయ్యే పని కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ వాదనకు మద్దతు ఇస్తున్నారు.సోదర తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా సోషల్ మీడియాకు అక్రిడిటేషన్స్ ఇవ్వమని తేల్చి చెప్పింది.ఈ పరిస్థితుల్లో ఇక్కడ కీలకమంత్రికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారా..?అంటే సమాధానం సందేహాస్పదమే..? ఒక వేళ ఆయనకు వ్యతిరేకంగా మంత్రుల కమిటీ వ్యవహరిస్తే అది సంచలనమే.చూద్దాం దీనిపై ఏమి జరుగుతుందో..?